అరెస్టయ్యాడనుకున్న రవీందర్‌రెడ్డి పులివెందులలో జగన్ వద్ద ప్రత్యక్షం

  • రవీందర్‌రెడ్డి అరెస్ట్ అయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం
  • నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జగన్‌తోనే ఉన్న రవీందర్‌రెడ్డి 
  • జగన్ అధికారంలో ఉండగా సోషల్ మీడియాలో టీడీపీ నేతలు, షర్మిల, సునీతపై అసభ్య ప్రచారం
  • భూదందాలు, సెటిల్మెంట్లు, బ్లాక్‌మెయిల్ ఆరోపణలు
అరెస్ట్ అయ్యాడని ప్రచారం జరిగిన వైసీపీ నేత, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త, వైఎస్ భారతి పీఏ వర్రా రవీందర్‌రెడ్డి నిన్న పులివెందులలో జగన్ వద్ద కనిపించారు. పులివెందుల వచ్చిన జగన్‌ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. రవీందర్‌రెడ్డి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే ఉన్నారు

వైసీపీ అధికారంలో ఉండగా రవీందర్‌రెడ్డి గత రెండుమూడేళ్లుగా టీడీపీని, ఆ పార్టీ నేతలను టార్గెట్‌గా చేసుకుని అసత్య పోస్టులతో సోషల్ మీడియాను ముంచెత్తారు. చివరికి జగన్ సోదరి షర్మిల, వివేకా కుమార్తె సునీతను సైతం వదల్లేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పైనా అసభ్య పదజాలంతో వ్యతిరేక పోస్టులు పెట్టారు. 

రవీందర్‌రెడ్డిపై ఏపీ, తెలంగాణలోనూ కేసులు నమోదయ్యాయి. సునీత ఫిర్యాదుపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిల కూడా ఆయనపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుత మంత్రి వంగలపూడి అనితపై రెండేళ్ల క్రితం అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆమె ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. 

ఈ నేపథ్యంలో రవీందర్‌రెడ్డిని నిన్న అరెస్ట్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, నిన్న ఆయన జగన్ వద్ద కనిపించడంతో అవి తప్పుడు వార్తలని తేలిపోయింది. కాగా, రవీందర్‌రెడ్డి‌పై సెటిల్‌మెంట్లు, భూ దందాలు, పంచాయితీలు, బ్లాక్‌మెయిలింగ్ వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి.

Ravinder Reddy
YSRCP
Jagan
Pulivendula
Kadapa District

More Telugu News